Saturday, May 4, 2024

GHMC: జీహెచ్ఎంసీలో ఎన్నికల సందడి షురూ..

నిన్న‌టి వ‌రకూ తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ వైపు అంద‌రి చూపు ఉండేది.. అక్క‌డ ఎవరు గెలుస్తారో.. టీఆర్ఎస్ గెలుస్తుందా.. బీజేపీ గెలుస్తుందా అని అంద‌రూ ఎదురు చూశారు. ఇక ఆ ఫ‌లితాల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపొందారు. ఆ ఉప ఎన్నిక ఫ‌లితంతో ముగిసిపోయింది. ఇప్పుడు న‌గ‌రంలో జీహెచ్ఎంసీలోని బల్దియాలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ను బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 20న జరిగే ఎన్నికల్లో స్టాండ్ అవ్వాలని గ్రేటర్ లో ప్రాతినిధ్యం ఉన్న మూడు ప్రధాన పార్టీల కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు.


గ్రేటర్ ఎన్నికలు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక 8 నెలల కిందటే జరిగాయి. అయినా ఇంతవరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగక‌పోగా, లేటుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు కొత్త కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది.
అయితే మేయర్ పదవి మహిళలకు రిజర్వేషన్ కాగా, డిప్యూటీ మేయర్ జనరల్‌కు అవకాశమున్నా మహిళకే కట్టబెట్టారు. దీంతో చాలా మంది సీనియర్ కార్పొరేటర్లు ఫీల్ అయ్యారు.

జ‌రిగిందేదో జ‌రిగింద‌నుకొని కనీసం స్టాండింగ్ కమిటీ మెంబర్‌గానైనా అవకాశం ఇస్తే బాగుండని వారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రావ‌డంతో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు కార్పొరేటర్లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. నవంబర్ 20న స్టాండింగ్ కమిటీకి ఎన్నిక జరగనుండ‌గా, అదే రోజే కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -


బల్దియాలో అభివృద్ధి కోసం ఏ నిర్ణయం జరగాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అన్నమాట. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యులుంటారు. ఈ లెక్కన 150 మంది కార్పొరేటర్లకు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతారు. ప్రస్తుతం సభలో 56 మంది టీఆర్ఎస్, 47 మంది బీజేపీ, 44 మంది ఎంఐఎం సభ్యులున్నారు. అంటే ఐదు లేదా ఆరుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకోనున్నారు. బీజేపీకి న‌లుగురికి, ఎంఐఎంలో నలుగురికి స్టాండింగ్ కమిటీలో స్థానాలు దక్కనున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో స్టాండింగ్ క‌మిటీ మెంబ‌ర్లుగా ఎవరెవ‌రు ఉంటార‌నేది తెలియాలంటే ఈనెల 20వ‌తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement