Sunday, April 28, 2024

TS | పండుగలా మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవం.. 15న ఒకేసారి 9 కాలేజీల్లో తరగతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ నెల 15న మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్న కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగామ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆయా జిల్లా కేంద్రాల్లో 15 నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు-తో విద్యార్థులకే కాకుండా, అనుంబంధంగా ఏర్పాటయ్యే హాస్పిటల్‌తో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు-తో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఒక మెడికల్‌ కాలేజీని సందర్శించి తరగతులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు కేవలం రెండు మెడికల్‌ కాలేజీలు మాత్రమే దక్కాయన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీల మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు మోసం చేసినా.. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న ఏ-కై-క రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. 15న ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఇప్పుడు ఆహార ఉత్పత్తిలోనే కాదు.. దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్లను తయారుచేసే కార్ఖానాగా ఎదిగిందని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -

నాడు చివర.. నేడు అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం వైద్య సేవల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లు- గల రాష్ట్రం.. తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లు- ఉన్నాయని తెలిపారు. 2014లో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రస్థానంలోకి చేరిందన్నారు. ఈ ఏడాది పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లలో 43 శాతం రాష్ట్రంలోనే పెరిగాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వల్ల నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లో మాత్రమే మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు- చేసిందన్నారు. రాష్ట్రం వచ్చిన రోజు తెంలగాణలో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకు జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు- చేయడంతో ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలో ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు-తో అందుబాటు-లోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి హరీష్‌ రావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement