Sunday, May 5, 2024

TS | మేడారం భక్తులకు పర్యావరణ ఫీజు మినహాయింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తోందన్నారు. సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము (ఎన్విరాన్‌ మెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నట్లు- ఆమె తెలిపారు. ఈమేరకు చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్లిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తోంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement