Saturday, May 18, 2024

Encounter – బిసిల‌పై వ్య‌క్తి గ‌త దూష‌ణ‌ల‌కు దిగితే తాట‌తీస్తాం – కాంగ్రెస్ కు బిసి మంత్రులు వార్నింగ్

హైద‌రాబాద్: బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు హెచ్చరించారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో పలువురు బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ముక్త కంఠమ్ తో ఖండించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, యోగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లతో పాటు ఇంకా పలువురు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ… బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు. అదేవిధంగా కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ వస్తుందని వివరించారు. అనేక విధాలుగా తమ ఎదుగుదలకు అండగా నిలిచినా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేక బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు.

అధికారంలో ఉన్నంతకాలం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, వారి అభివృద్దిని విస్మరించిందని విమర్శించారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటాయని, ఈ విధమైన వ్యక్తిగత, నోటికొచ్చిన పదాలను వాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత, కుల వృత్తులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమా ? లేక పార్టీ విధానమా ? అనేది పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బీసీ సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తామని చెప్పారు. త‌మ ఓట్లతో గెలిచి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామన్నారు. బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. తమ జోలికి వస్తే అన్ని బీసీ సామాజిక వర్గాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయని హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 130 సంవత్సరాల చరిత్ర తమ పార్టీదని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కాదని, పార్టీ నాయకులు మాట్లాడే బాషను మార్చుకోవాలని, అలాంటి వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు.

బీసీలు అంటే అసమర్ధులు అనుకోవద్దని, తాము బాధ్య‌తాయుతమైన పదవుల్లో ఉన్నందున హుందాగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎంతవరకైనా వెనుకాడబోమన్నారు. బీసీలు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజుల్లో త‌మ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

https://twitter.com/BRSparty/status/1681592330615390209
Advertisement

తాజా వార్తలు

Advertisement