Wednesday, May 15, 2024

TS | ఆల‌య ఆవ‌ర‌ణ‌లో డంప్ యార్డు ను ఎత్తివేయిస్తా : బండి సంజయ్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ప్రభన్యూస్ : కరీంనగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి సమీపంలోని డంప్ యార్డును ఇత‌ర‌ ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

శివరాత్రి సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డంప్ యార్డును తొలగించాలని కోరుతూ ఆలయ కమిటీ వారు వినతిపత్రం సమర్పించారు. ఆలయ ఆవరణలో డంప్‌యార్డు ఉండటంతో దుర్వాసన వెలువడుతోందని, ఆలయానికి వ‌చ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని వాపోయారు. బండి సంజయ్ సానుకూలంగా స్పందించి డంప్ యార్డును త్వరలో తరలిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం షెడ్డు ఏర్పాటుకు సహకరించాలని ఆలయ కమిటీ కోరగా, ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement