Tuesday, April 30, 2024

NZB: రాష్ట్రంలో అవినీతి పాలన అంతం కావాలి… ఈటల

బిక్కనూర్, జులై 31, ప్రభ న్యూస్ : రాష్ట్రంలో అవినీతి పాలన అంతం కావాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి నిర్మల్ వెళ్తున్న ఆయనను స్థానిక టోల్గేట్ వద్ద బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అంతేకాకుండా వేలాది ఇండ్లు కూలిపోయాయని చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జరిగిన పంట పొలాల ఆస్తి నష్టాన్ని తెలుసుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నరసింహులు, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తిరుమలేష్, సాయి రెడ్డి, రంజిత్, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement