Wednesday, May 15, 2024

Congress vs Brs – కాళేశ్వ‌రంపై చ‌ర్చ‌కు రండి – కెటిఆర్,హారీష్ ల‌కు రేవంత్ స‌వాల్

హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం ప్రధానమంత్రి పదవిని కూడ వదులుకుందని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. పదవులను, ప్రాణాలను త్యాగం చేయడంతో పాటు ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమన్నారు. అలాంటి రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని చెప్పారు. ఎకరం ఆయకట్టుకు నీరిచ్చేందుకు రూ. 45 వేలను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులు హాజరౌతామన్నారు. కేటీఆర్, హరీష్ రావులు చర్చకు సిద్దమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఖ‌మ్మం సభలో చేసిన రాహుల్ చేసిన‌ వ్యాఖ్యల్లో తప్పేం ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యల్లో మీరు తప్పును చూపితే దానికి మీరు విధించే శిక్షకు తాము సిద్దమని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తమ అవినీతి బయట పడిందని కేటీఆర్, హరీష్ రావులు పెడ బొబ్బలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పదేళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో పర్యటించే అర్హత రాహుల్ గాంధీకి లేదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. త్యాగాలకు గాంధీ కుటుంబం పేరు పొందితే , అవినీతికి కల్వకుంట్ల కుటుంబం పేరొందిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి కాకుండా తెలంగాణలో పర్యటించే అర్హత ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు. అసలు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు మీకుందా అని బిఆర్ఎస్ నేత‌ల‌ను ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రధాన ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పేదల సంక్షేమం కోసం ఆర్టీఐ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement