Sunday, April 28, 2024

TS : యాదాద్రి, భ‌ద్రాద్రిలో సీఎం రేవంత్‌రెడ్డి..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు యాద‌గిరిగుట్ట‌, భ‌ద్రాద్రిలో ప‌ర్య‌టించారు. ముందుగా ఆయ‌న యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాల‌లో పాల్గొన్నారు.. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.

ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్శించిన రేవంత్…
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

భ‌ద్రాద్రి రామ‌య్య సేవ‌లో..
యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ లో సిఎం భద్రాచలం చేరుకున్నారు. అనంత‌రం శ్రీ సీతారామచంద్ర స్వామిని రేవంత్ దంప‌తులు దర్శించుకున్నారు. రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement