Wednesday, May 15, 2024

అధికారంలోకి వ‌స్తామంటూ ఎన్నిసార్లు చెప్పినా ప్ర‌జ‌లు నిన్ను న‌మ్మ‌రు కెసిఆర్ – సిఎల్పీ నేత భ‌ట్టి

న‌కిరేక‌ల్లు – “కేసీఆర్ ఇక ప్రజలు నిన్ను నమ్మరు. నన్ను నమ్మండి మనమే అధికారంలోకి వస్తామంటూ పలు మార్లు పదే పదే చెబుతున్న ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నీ మీద నమ్మకం లేదు కాబట్టే బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు గోడ దూకడానికి కూడా రెడీగా ఉన్నారు అంటూ సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్యానించారు..

న‌కిరేక‌ల్ లోని కేత‌ప‌ల్లిలోని పాద‌యాత్ర విరామ స‌మ‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, “పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడమేన‌న్నారు.. కుర్చి వేసుకొని అక్కడే కూర్చొని 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయిస్తానని చెప్పిన కెసిఆర్ ఏడు సంవత్సరాలుగా ఎందుకు పూర్తి చేయలేద‌ని” నిల‌దీశారు.

“ఏడు సంవత్సరాల్లో పూర్తికాని ప్రాజెక్టు నాలుగైదు మాసాల్లో ఎలా పూర్తి అవుతుంది? ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన నిధులు నీ దగ్గర ఎక్కడివి? ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన సమయం ఎక్కడున్నది? రెండు నెలల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే నువ్వెట్లా ప్రాజెక్టును పూర్తి చేస్తావ్? ఎన్నికల కోసం మరోసారి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావ్? ఇంకెంతకాలం ప్రజలను ఓట్లా మోసం చేస్తావ్? ” అంటూ ఫైర్ అయ్యారు

“పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులో కొంతమంది కేసులు వేశారని సీఎం కేసీఆర్ తప్పుడు సమాచారం, సంకేతం ఇస్తున్నారు? ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళింది ఎవరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రజలు కోర్టుకు వెళ్లారంటే నువ్వు చేస్తున్నది అన్యాయం కాబట్టి న్యాయం చేయమని వెళ్లడం తప్పు కాదు కదా
ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వెళ్లేది కోర్టులకే.. న్యాయస్థానాలు కేసీఆర్ చేసింది అన్యాయమని అనుకుంటనే పనులు ఆపమని అంటుంది. నువ్వు చేసేది న్యాయమే అయితే కోర్టులు ఇచ్చిన తీర్పులే అన్యాయంగా ఉంటే బేషరతుగా బయటికి వచ్చి న్యాయస్థానాలు అన్యాయం చేస్తూన్నాయని ఎందుకు చెప్పటం లేదు. పాలన రాజ్యాంగం ప్రకారమే జరగాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా కాదు” అంటూ వివ‌రంగా చెప్పారు భ‌ట్టి.

“2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలి. పోలీసులు నా చేతుల్లో ఉన్నారని భయపెట్టి బెదిరించి బలవంతంగా ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి భూములు గుంజుకోవడం అన్యాయం కాదా?
నువ్వు, నీ పాలన యంత్రాంగం అన్యాయం చేస్తున్నారు కాబట్టే ప్రజలు న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నారు. బిఆర్ఎస్ పాలనలో పేద నిర్వాసితులు బతికే హక్కు లేదా? ఎస్సీ, ఎస్టీ బీసీ సన్న చిన్నకారు రైతుల గురించి రాష్ట్రంలో మాట్లాడేవారు కరువయ్యారు. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని పోలీసులతో బెదిరింపులు చేయిస్తూ పాలన ఇంకెంత కాలం చేస్తావు? ప్రజలు నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సిద్ధమవుతున్నారు. నువ్వు తీసుకొచ్చిన ధరణి నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న కృష్ణా జిల్లాల్లో నీటి వాటా ఎంత ఉందో సీఎం కేసీఆర్ ఎందుకు తేల్చడం లేదు? ఎక్కడ లాలూచీ పడుతున్నారు? ప్రజల ప్రయోజనాల కంటే మీ ప్రయోజనాలను ఎందుకు చూసుకుంటున్నారు? 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం సరికాదు” అంటూ బిఆర్ఎస్ పాల‌న‌ను దుమ్మెత్తిపోశారు

- Advertisement -

“కృష్ణాజలాలలో తెలంగాణ వాటా ఎంతో వెంటనే తేల్చాలని డిమాండ్ చేసిన భ‌ట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి జగదీష్ రెడ్డిలు 10 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్ ఎల్ బి సి టన్నెల్, నక్కలగండి, డిండి ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు?ఆస్తులు పోగేసుకోవడంపై ఉన్న శ్రద్ధ జిల్లా ప్రజలకు సాగునీరు అందించే విషయంలో ఎందుకు లేదు?” అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

“నల్లగొండ జిల్లాకు కృష్ణా నది జలాలు రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఆంధ్ర పాలకులు లేరు మరీ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిధులు తీసుకురాకుండా ఏమైనా గాడిదలు కాస్తున్నారా?” అని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లంల ఈ ప్రాజెక్టు పనులను 2014 సంవత్సరం నాటికి 80 శాతం పనులు పూర్తి చేయగా.., పదేండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో 20% పనులు పూర్తికాకపోవడం సిగ్గుచేటు” అని అన్నారు.

మీడియా సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను, ఎంపీపీ శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు దైద రవీందర్, వేదాసు శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement