Thursday, May 16, 2024

BRS – నేడే మెదక్ వేదికగా కెసిఆర్ ప్రగతి శంఖరావం ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా ప్రకటన తర్వాత సీఎం కేసీఆర్‌ తొలిసారిగా జిల్లాల్లో పర్యటనకు సిద్దమయ్యారు. నేడు ఆయన మెదక్‌ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మెదక్‌ జిల్లా వేదికగా ప్రగతి శంఖారావాన్ని పూరించి ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వ విధానాలను, త్వరలో అమలు చేయబోయే అనేక పథకాలను ఈ వేదికద్వారా వివరించనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటన తర్వాత జరిగే మొదటి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటు న్నాయి. సీఎం కేసీఆర్‌ నేడు మెదక్‌లో పర్యటించనున్నారు. మెదక్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రారంభించను న్నారు.ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న షెడ్యూలు ….

దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీకి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్‌ పట్టణం వేదిక కానున్నది. మెదక్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ ఆఫీస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుమ్మడిదల, నర్సాపూర్‌, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్‌ చేరుకోనున్నారు. తొలుత ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయాన్ని, మధ్యాహ్నం 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్‌ సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement