Sunday, May 5, 2024

మరియమ్మ లాకప్ డెత్.. తెలంగాణ సర్కార్‌దే బాధ్యత

తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు కావడం తెలిసి ఎంతో బాధ కలిగించిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ కేసులో పోలీసులు ఆమెను రాత్రి వేళ స్టేషన్‌కి తీసుకెళ్ళడమేగాక… ఒక మహిళను అదుపులోకి తీసుకున్నప్పుడు మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులే అమలు చెయ్యకపోవడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ ఘటన జరిగిన ఆ పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం మన వ్యవస్థలు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నాయో అర్థమవుతోందన్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం రీపోస్ట్‌మార్టం చేయించి, తప్పుచేసినవారికి కఠిన శిక్షవిధించి తల్లిని కోల్పోయిన ఆ బాధిత కుటుంబానికి కొంతైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, దళితులు ఎన్నో విధాలుగా వెతలకు గురవుతున్నా… ఆ కేసులు సరైన సమయంలో పరిష్కారం కాకపోవడం, బాధితులు న్యాయం కోసం నిరీక్షిస్తూ ఉండటం జరుగుతోందన్నారు. ఏదేమైనా ఈ పరిణామాలకు తెలంగాణ సర్కారు పూర్తి బాధ్యత వహించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: మరియమ్మ కుటుంబానికి న్యాయం.. కాంగ్రెస్ డిమాండ్ సీఎం హామీ

Advertisement

తాజా వార్తలు

Advertisement