Thursday, May 9, 2024

రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తా.. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా: భట్టి

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న దోపిడిని ఇక భరించలేమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా,  సీఎల్పీ లీడర్ గా రాష్ట్రమంత పాదయాత్ర చేస్తా ప్రకటించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న  టిఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ధిక దోపిడి, ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట చేస్తున్న అవినీతి గురించి ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు టిఆర్ఎస్ సర్కార్ మెడలు వంచడానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ద్వారా ప్రజలను మమేకం చేసి ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొడతామని హెచ్చించారు.

పీపుల్స్ మార్చ్ లో వేసే ప్రతి అడుగు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ సర్కారుపై సమర యాత్ర చేయడానికే అని స్పష్టం చేశారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా,  ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పథకాలు తీసుకురావాలని సూచించారు.

టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2.30 లక్షల కోట్లు దోపిడి జరుగుతుందని ఆరోపించారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతున్నదని ధ్వజ మెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement