Sunday, April 28, 2024

TS: రోడ్ల నిర్మాణానికి రూ.850కోట్లు మంజూరు.. మోడీకి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్

కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల (CRIF) నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 రహదారుల నిర్మాణానికి రూ.107 కోట్లను విడుదల చేసింది. కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల పరిధిలో మొత్తం 57 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.

వాటిలో గన్నేరువరం నుండి బెజ్జంకి వరకు మొత్తం 23 కి.మీల పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరిస్తూ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.32 కోట్లను విడుదల చేశారు. అట్లాగే అంతక్కపేట నుండి కొత్తకొండ వరకు మొత్తం 10కి.మీల మేరకు రోడ్డు నిర్మాణానికి రూ.25కోట్లు విడుదల చేశారు. మల్యాల నుండి నూకపల్లి, రామన్నపేట గ్రామాల మీదుగా కాచపల్లి వరకు మొత్తం 11.7కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీంతో పాటు హుస్నాబాద్ నుండి రామవరం వరకు మొత్తం 11.5 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లను విడుదల చేయడం గమనార్హం.

మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సీఆర్ఐఎఫ్ కింద రూ.107 కోట్లను విడుదల చేయడం పట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, రోడ్ల నిర్మాణం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని బండి సంజయ్ తెలిపారు. తాము పంపిన ప్రతిపాదనలను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వం సహకరించి ఉంటే రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు వచ్చేవన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే నిధులొస్తాయనడానికి ఇది నిదర్శనమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement