Friday, May 3, 2024

వ‌ర‌ద‌ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్మీ బృందం : సీఎస్ సోమేశ్ కుమార్

వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పాల్గొంటున్నదని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహకరించాల్సిందిగా భారత సైన్యాన్నికోరామని సీఎస్ తెలిపారు. దీనికి స్పందనగా 68 మంది సభ్యుల పదాతిదళం, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజనీరింగ్ బృందం సహాయచర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయని వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై జరిపిన సమీక్ష సమావేశంలో సీఎస్ తెలిపారు.

సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపామని, అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్ధంగా ఉన్నాయని, లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్, సింగరేణి కాలరీస్ ఎండి ఎం. శ్రీధర్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని సీఎస్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ, పునరావాస చర్యలకు ఉపయోగించాలని సీఎస్ ఆదేశించారు. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement