Monday, May 6, 2024

ఖమ్మంకు 49.49కోట్ల ఫండ్స్​.. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సమగ్రాభివృద్ధి

ఖమ్మం : సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఖమ్మం నగర రూపురేఖలు మార్చి సమగ్రాభివృద్ధి చేయగలిగామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పారదర్శక పాలన అందిస్తుండడంతో ఖమ్మానికి మహర్దశ పట్టిందని పేర్కొన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు తన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్డీఎఫ్‌ కింద 49.49 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నగరంలో వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఇతర ప్రాంతాల ప్రజలు సంతోషిస్తుంటే ఖమ్మం నగరానికి చెందిన కొందరు దుర్బుద్ధితో మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి అన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా ఖమ్మానికి రూ.2.70 లక్షల నిధులు వస్తున్నాయన్నారు. గోళ్లపాడు కాలువపై 100 కోట్లతో దాదాపు 11 కిలోమీటర్ల మేర అండర్‌ డ్రైనేజీ పైపులైన్‌ నిర్మించి త్రీటౌన్‌ ప్రజల సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న 30 ఏళ్లకు సరిపడా పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్‌ నిధులనే కాకుండా ఇతర నిధులను నగరాభివృద్ధికి కేటాయించామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, డ్రెయిన్లు వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ఖమ్మం అభివృద్ధికి శ్రమిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement