మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మరో ఆరు నెలలోపు ఉప ఎన్నికల జరగాల్సి ఉంటుంది. అయితే, టీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ క్యాడర్ ను ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేసిన గులాబీ పార్టీ.. ఇక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈటలను ఒంటరిని చేసి మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే గెలిచే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందు కోసం ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలో దిపింది.
ఈటల రాజేందర్ కు హుజూరాబాద్లో ఉన్న పట్టుగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఆయనే గెలుస్తూ వస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల ఆరు స్లారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, మంత్రిగా ఉన్న ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడం, అనంతరం మంత్రివర్గం నుంచి తొలగించడం, అన్ని చకచక జరిగిపోయాయి. ఇక, తనను అవమానించి పార్టీలో కొనసాగనంటూ ఈటల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈటలకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో గెలవాలంటే అంత ఈజీ కాదు. హుజురాబాద్ ఉప ఎన్నికల టీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ప్రజల్లో ఈటల రాజేందర్ కు ఉన్న పేరును ఎదుర్కొని గెలవాలంటే అంత సులవు కాదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్తోంది. ఇప్పిటికే మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలో దింపి మరీ అన్ని పెండింగ్ పనులు చేస్తోంది. ఈ క్రమంలో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం కోసం ప్రభుత్వం రూ.35కోట్ల కేటాయించడం సంచలనంగా మారింది. రోడ్లు, తాగునీరు తదితర అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ఇందులో వార్డుల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు, తాగునీటి కోసం రూ. 10.52 కోట్లను కేటాయించింది. ఈ పనులన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి గంగుల చెప్పారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని ప్రకటించారు. అయితే, ఇతర నియోజకవర్గాలకు ఎంత అడిగినా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పుడు అడగకుండానే ఈ కరోనా సమయంలో అన్ని కోట్లు ఇస్తోందంటే ఈటల భయం బాగానే పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. హుజురాబాద్ అభివృద్దిని తామే చేశామని చెప్పుకునే విధంగా ప్రజల్లో సంకేతాలు పంపాలని టీఆరెఎస్ భావిస్తోంది.
ఇదీ చదవండి: అవినీతి బాగోతం: పంచాయతీ కార్యదర్శీ.. ఇదేం కక్కుర్తి!