Sunday, May 19, 2024

కొంప ముంచిన ట్రైన్ టిక్కెట్ -రూ.2కోట్లు పోయాయ్

ఓ వ్య‌క్తి రూ.2కోట్ల రూపాయ‌ల‌తో ట్రైన్ ఎక్కాడు..అంత‌డ‌బ్బు ఉంద‌న్న కంగారులో ట్రైన్ టిక్కెట్ కొన‌లేదు. దాంతో పోలీసుల‌కి అడ్డంగా దొరిక‌డ‌మే కాదు..అత‌ని ద‌గ్గ‌ర వున్న న‌గ‌దుని వారికి స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. రాజస్థాన్‌లోని సుంత్రా జిల్లా జాలోర్ తాలుకా వారన్వా గ్రామానికి చెందిన జెన్ సింగ్ అలియాస్ మనోహర్ సింగ్ .. ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినస్ నుంచి మంగళూరు వెళ్లే రైలు ఎక్కాడు. రైలు మహారాష్ట్ర సరిహద్దు దాటింది. అంతలోనే టీసీ వచ్చాడు.. అందరిని టికెట్‌ చూపించమని అడిగాడు.. జైన్‌ సింగ్‌ దగ్గర టికెట్‌ లేకపోవడంతో.. లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. జైన్‌ సింగ్‌ ప్రవర్తన ఏదో తేడాగా అనిపించి… టికెట్ కలెక్టర్‌ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత రైల్వే ఇన్‌స్పెక్టర్ విపిన్ సింగ్ రాణా రైలు ఎక్కి.. జన్‌సింగ్ వద్దకు వెళ్లాడు. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది.

బ్యాగ్‌లో ఏమున్నాయని అడిగితే.. బట్టలు తప్ప ఏమీ లేవని సమాధానం చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. బ్యాగ్ తెరిచి చూస్తే.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం రూ.2 కోట్ల నగదు ఉందని పోలీసులు తెలిపారు. అవి కూడా.. అన్నీ రూ.2వేల నోట్లే. ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలు కర్వార్‌‌లోని శిరవాడ రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత.. రైల్వే పోలీసులు అతడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. ఆ డబ్బు ఎక్కడిది అని పోలీసులు అడగ్గా.. అదంతా హవాలా డబ్బుని.. మంగళూరులో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న తప్పుకు మొత్తం ఆగం ఆగమైంది.. మనోడు..ట్రైన్‌ ఎక్కేప్పుడే.. టికెట్‌ తీసుకుని ఉంటే..ఇంత సీన్‌ జరిగేది కాదు క‌దా..

Advertisement

తాజా వార్తలు

Advertisement