Wednesday, May 15, 2024

సిరిసిల్లకు ‘టెక్స్‌పోర్ట్‌’: పెద్దూరు అపెరల్‌ పార్కులో వస్త్ర తయారీ పరిశ్రమ.. రూ.60 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిరిసిల్ల అపెరల్‌ పార్కులో టెక్స్‌పోర్ట్‌ కంపెనీ వస్త్రాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. పార్కులో 7.42 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ఈ పరిశ్రమలో తొలుత 800 యంత్రాలను ఏర్పాటు చేయనున్న కంపెనీ అనంతరం యంత్రాల సంఖ్యను రెండు వేలకు పెంచనుంది. సుమారు 60 కోట్ల రూపాయలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో టెక్స్‌పోర్ట్‌ కంపెనీ ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంత్రి కే. తారకరామారావు సమక్షంలో చేనేత, జౌళి కమిషనర్‌ శైలజ రామయ్యార్‌, టెక్స్‌పోర్ట్‌ కంపెనీ ఎండీ నరేంద్ర డి గోయెంకా అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు.

సిరిసిల్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న అపెరల్‌ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీకి కేటీఆర్‌ స్వాగతం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్‌టైల్‌ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపుదలకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్‌పోర్ట్‌ కంపెనీ పెట్టే పెట్టుబడితో సుమారు 2 వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడే ఈ ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్‌పోర్ట్‌ కంపెనీ ఎండి గోయెంకా తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ కంపెనీ ఏర్పాటు ఉంటుందన్నారు.

సిిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అపారల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నది. ఈ పార్కులో పరిశ్రమకు సంబంధించిన పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మొత్తం 63 ఎకరాల సువిశాల పార్కును సుమారు 175 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. వస్త్రాల ఉత్పత్తితోపాటు ఎగుమతులకు అనుగుణంగా బిల్ట్‌ టు సూట్‌ పద్ధతిన దేశంలోనే తొలిసారిగా ఈ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. బెంగళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్‌ కంపెనీ 1978 నుంచి అపెరల్‌ం రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. విదేశీ ఎగుమతులే ప్రధానంగా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారంలో దీర్ఘకాలంగా పనిచేస్తోంది. సంవత్సరానికి 17 మిలియన్లకు పైగా వస్త్రాలను కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాలలో రెడీమేడ్‌ వస్త్ర తయారీ పరిశ్రమలున్నాయి. కంపెనీ సుమారు రూ. 620 కోట్ల వార్షిక ఆదాయంతో దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement