Saturday, May 4, 2024

రాజకీయ ప్రస్థానం, 44 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచింది ఈ రోజే.. యాది చేసుకున్న చంద్రబాబు

అమరావతి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గతస్మృతులు గుర్తుచేసుకున్నారు. 44 ఏళ్ల క్రితం ఇదే రోజున చంద్రబాబు తొలి సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన… తన ప్రత్యర్థి కొంగర పట్టాభి రామ చౌదరిపై గెలుపొందారు. ప్రజా ప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అధినేత ప్రస్థానంపై నేతలు పాత విషయాలు గుర్తుచెయ్యగా… తన సుదీర్ఘ ప్రయాణంపై చంద్రబాబు మాట్లాడారు. నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

నాడు యూనివర్సిటీ విద్యార్థులుగా గ్రామాలకు వెళితే ఎంతో ఆదరణ ఉండేదని చెప్పారు. యూనివర్సిటీ లీడర్ గా ఎదిగి తరవాత అసెంబ్లీకి పోటీ చేశానని తెలిపారు. అసెంబ్లీకి ఎన్నికైన తరువాత తనకు మంత్రి పదవి కావాలని నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగితే….ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావ్….తొలి సారి ఎమ్మెల్యేవి మంత్రి పదవి కావాలా అని ప్రశ్నించారని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత అంజయ్య క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి గా అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఓ సందర్భంలో పూర్తిగా వ్యాపారం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేసినట్లు చంద్రబాబు నేతలకు వివరించారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోనే కొనసాగానని చెప్పారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ను కలిశానని.. అప్పుడు ఆయన ఓ షూటింగ్ లో వరుడు వేషంతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు.

తెలుగు దేశం పార్టీలో నేతలకు ట్రైనింగ్ సెంటర్ నిర్వహణతో మెరుగైన ఫలితాలు సాధించామని చంద్రబాబు అన్నారు. 1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన సమయంలో… చంద్రబాబు చాలా కీలకంగా వ్యవహరించిన విషయాన్ని నేతలు సమావేశంలో ప్రస్తావించగా…చంద్రబాబు నాటి విషయాలను ఒక్కొక్కటి వివరించారు. తన ప్రయాణంలో ఎంతో మంది నేతలతో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్, వాజ్ పేయి లాంటి మహా నేతలతో తన ప్రయాణం గురించి చంద్రబాబు వివరించారు. ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్ పేయి తన మాటకు ఎంతో విలువ ఇచ్చే వారని…బాబు చెపితే కరెక్ట్ అనే వారని…ఆయనతో పని చేసిన సందర్భాలను చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పం లో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్న సమయంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే కూడా విమర్శలు చేశారని…ఇప్పుడు అంతటా డ్రిప్ ఇరిగేషన్ అవసరం వచ్చిందని నేతలు ప్రస్తావించారు.

రాజకీయం జీవితంలో ఏది బెస్ట్ పార్ట్ నేతలు అడగగా…అలా అని ప్రత్యేకంగా చెప్పలేనని అన్నారు. పని చెయ్యాలి…సాధించాలి అనే తపన మాత్రం తగ్గలేదని చంద్రబాబు నేతలతో అన్నారు. మీతో ప్రయాణంలో మేము ఎంతో నేర్చుకున్నాం అని మీటింగ్ లో నేతలు చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు తో పాటు సీనియర్ నేతలు దూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ, అశోక్ బాబు, టిడి జనార్థన్, మాల్యాద్రి, పట్టాభి,రఫి, రామాంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement