Monday, April 29, 2024

మునుగోడులో ప్రలోభాలకు తెర.. ఓటర్లకు రూ.1.56 లక్షలతో విమాన టికెట్లు బుకింగ్​!

మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న ఘటనలు వెలుగు చేస్తున్నాయి. చండూరు మండలంలోని ఓ గ్రామంలో 26 మంది ఓటర్లు ముంబయికి వలస వెళ్లారు. ఓటేయడానికి వారిని నవంబరు 1వ తేదీన రప్పించేలా ఓ ప్రధాన పార్టీ ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున రూ. 1.56 లక్షలు వెచ్చించి.. హైదరాబాద్‌ వరకు విమాన టికెట్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఎయిర్​పోర్టు నుంచి సొంతూరికి రావడానికి బస్సు ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

పోలింగ్‌ అనంతరం వారు తిరిగి ముంబయికి వెళ్లడానికి కావాల్సిన వారికి రైలు టికెట్లు, లేకుంటే విమానం టికెట్లు బుక్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఓటర్లలో చాలామంది గుజరాత్‌లోని సూరత్‌, మహారాష్ట్రలోని ముంబయి, భివండి, సోలాపూర్‌, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిని రప్పించేందుకు రెండు ప్రధాన పార్టీలు అంతర్గతంగా ప్రత్యేకంగా విభాగాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి గ్రామంలో కొంతమంది నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించాయి. ఓటర్లకు రెండు రోజుల పాటు బస, ఇతర సదుపాయాలు, తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చూడడం వారి విధిగా మారినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement