Tuesday, May 14, 2024

జే బ్రాండ్లపై చర్చకు పట్టు: ఏపీ మండలి చైర్మన్ కు టీడీపీ ఎమ్మెల్సీల లేఖ

ఏపీ మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. జంగారెడ్డి గూడెం మరణాలు సహా ఏపీలో సరపరా అవుతోన్న మద్యం నాణ్యతపై చర్చ జరపాలని ఎమ్మెల్సీలు కోరారు. ఏపీలో నాసిరకం మద్యం.. హానికారకమైన మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆరోపించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ బాధితులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మ‌ద్య‌ నిషేధం హామీతో అధికారంలోకొచ్చిన ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం వ్యాపారం ఆరంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సోమవారం ఏపీ శాసన మండలిలో మద్యం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది, వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అక్రమ మద్యంపై టీడీపీ నేత నారా లోకేష్ నేతృత్వంలోని తెలుగుదేశం ఎమ్మెల్సీలు నిరసల వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్నికల సమయంలో నిషేధం విధించే హామీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement