Friday, May 3, 2024

TDP – పొత్తుల వేళ ఇన్ చార్జీల‌ను మారుస్తున్న చంద్ర‌బాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై పడింది. రాష్ట్ర రాజకీయాలు పూర్తిస్థాయిలో మారుతున్న తరుణం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారు అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. జనసేనతో కలిసి ముందుకు సాగుతున్న ఆ పార్టీ ఇప్పుడు నియోజక వర్గ ఇన్‌చార్జిల ని యామకాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు. సర్వేలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న ఆయన మరోవైపు నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడైతే మార్పులు అవసరమో అక్కడ వాటిని తక్షణమే చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రజల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం వ్యక్తం కాకుండా అన్ని అంశాలను సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఖాళీల భర్తీతో పాటు కొందరికి స్థాన చలనం కలిగిస్తున్నారు.

వివాదాలు, కేడర్‌లో వ్యతిరేకత ఉన్న ఇంఛార్జ్‌లను తొలగిస్తూ కొత్తవారిని నియమిస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈ చర్యలతో పార్టీ సీనియర్‌ నేతల కొందరికి షాక్‌ తగులుతోంది. జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో అసెంబ్లిd సెగ్మెంట్ల వారీగా ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లను ప్రాతిపదికగా తీసుకుంటున్న టీడీపీ అధిష్టానం పెను మార్పులకు దిగింది. ఇంకోవైపు అభ్యర్థుల మార్పు అవసరమని భావించిన కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జిలను చంద్రబాబు నియమిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఇన్‌చార్జిల నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు ఈ నియామకాల స్పీడ్‌ను చంద్రబాబు మరింత పెంచారు. ఇటీవలె దాదాపు ఐదు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను చంద్రబాబు నియమించారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా మార్పులు చేస్తూ వస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో కొత్త లెక్కలు మొదలవడంతో వాటికి అనుగుణంగా టీడీపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇటీవలె కడప జిల్లా బద్వేల్‌ ఇన్‌చార్జిల బొజ్జా రోషన్న, సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ, గంగాధర నెల్లూరుకు వీఎం థామస్‌, రాజానగరంలో బొడ్డు వెంకటరమణ, గన్నవరానికి యార్లగడ్డ వెంకట్రావును ఇన్‌చార్జిలగా నియమించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పార్టీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో కూడా మార్పు చేశారు. భూమా కుటుంబానికి చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కకు పెట్టి ఆయన స్థానంలో మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను నియమించారు. ఈ నియామకం సీనియర్లను షాక్‌కు గురిచేసింది. ఇంకోవైపు మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఈసారి ఆమెకు పోటీచేసే అవకాశం దాదాపుగా లేనట్లుగానే కనిపిస్తోంది. ఈ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. గతంలో వైసీపీ, టీడీపీలో పనిచేసిన ఇరిగెల రామ్‌పుల్లారెడ్డి ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కీలక నేతగా ఉన్న ఆయన ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్‌ను జనసేన నుంచి ఆశిస్తూ ఉండటంతో అఖిలప్రియకు ఎంతవరకు అవకాశం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇటీవలె చంద్రబాబు అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిని హైదరాబాద్‌కు పిలిచి వారితో మాట్లాడారు. బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని టీడీపీ అధినేత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న ఇంఛార్జ్‌ల పోస్టులను అధిష్టానం భర్తీ చేయనుంది. ఇంకోవైపు సర్వే నివేదికలు, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను చంద్రబాబు మార్చనున్నట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement