Saturday, May 4, 2024

కాంగ్రెస్ డిక్లరేషన్ ఆచరణ సాధ్యమేనా?: తలసాని

వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. ఆ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా? దేశానికి సంబంధించిందా? అనే విష‌యంలో స్పష్టత లేద‌ని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత.. హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారిందని చెప్పారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రైతుల‌కు ఏం చేశారో చెప్పగలరా? అని నిల‌దీశారు. రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్ప‌డంపై మంత్రి త‌ల‌సాని మండిపడ్డారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు చేసిన పోరాటానికి త‌లొగ్గి తెలంగాణ రాష్ట్రం ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఢిల్లీ నాయ‌కులు రాష్ట్రానికి టూరిస్టులుగా వ‌చ్చి వెళ్తున్నారన్న తలసాని.. వారితో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేద‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement