Tuesday, May 7, 2024

Women Rescued | ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ.. కాపాడిన కరీంనగర్ సఖీ టీమ్​

ఇంటి నుంచి తప్పిపోయి.. ఎటు వెళ్లాలో తెలియకుండా.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళను కరీంనగర్ సఖి టీమ్​ కాపాడింది. ఆమె వివరాలను సేకరించి న్యాయ సహాయం అందిస్తోంది. ఈనెల 16న కొత్తపెల్లి మండలం చింతకుంట ఏరియా అంగన్వాడీ టీచర్ నుండి కాల్ సెంటర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ మహిళ ఆపదలో ఉందన్న ఫోన్ కాల్ అందుకున్న సఖి సిబ్బంది వెంటనే ఆమెను రెస్క్యూ చేశారు. చింతకుంట లోని శ్రీరాములపల్లి కాలనీలో ఓ మహిళ ఒంటరిగా ఉందని, దిక్కుతోచని స్థితిలో అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోందని స్థానిక అంగన్వాడీ టీచర్ కరీంనగర్ సఖి కాల్ సెంటర్​కి ఫోన్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమె నుండి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు.

ఆమెకు మాటలు రావని, చెవులు వినపడవనే విషయం తెలుసుకున్న సఖి టీమ్​ బదిరుల ఆశ్రమ పాఠశాల నుండి నిపుణులను రప్పించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఆమె పేరు స్వప్న అని మాత్రమే తెలిపిన మహిళ వివరాలు వెల్లడించకపోవడంతో ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ మహిళను తమ కూతురు స్వప్నగా గుర్తించిన తల్లిదండ్రులు సఖి టీమ్​ని సంప్రదించారు. స్వప్నది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంగా గుర్తించారు.

భర్త చిరంజీవి వేదించడంతో తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. వివాహేతర సంబంధం కారణంగా తన కూతురిని అల్లుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు సఖి సిబ్బందికి తెలియజేశారు. తన కూతురు గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. దీంతో ఫిర్యాదు కాపీ పరిశీలించిన సఖి సిబ్బంది స్వప్నను తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్.సంధ్యారాణి, సఖి అడ్మిన్ లక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడారు. స్వప్నకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సఖి ఆధ్వర్యంలో స్వప్నకు న్యాయ సహాయం అందిస్తామని, అవసరమైతే షెల్టర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వప్నను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన భర్త చిరంజీవిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement