Friday, May 3, 2024

గుర్రంతో వెకిలి చేష్టలు.. గంజాయి పొగ తాగించేందుకు చిత్రహింసలు

అందమైన పర్వతాలతో కూడిన రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో జంతు హింసకు పాల్పడిన ఘటన జనాల దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు వ్యక్తులు గుర్రాన్ని బలవంతంగా గంజాయి పీల్చినట్లు చూపించే వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ ఘటనను కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో తీసినట్టు సమాచారం. హిమాన్షి మెహ్రా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేరైన ఈ వీడియోపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతో మంది పర్యాటకులు తిరిగే ప్రాంతంలో ఈ రకంగా జంతు హింసకు పాల్పడటంపై పలువురు మండిపడుతున్నారు. గుర్రం నోరు, ముక్కు మూసి దానిని చిత్రవధకు గురి చేస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన చేష్టలు జంతు ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఈ వీడియోపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వీడియో చూసామని వీడియోలోని వ్యక్తుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసు ఎమర్జెన్సీ నంబర్లలో తమకు తెలియజేయాలని కూడా పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ వీడియో చూసినవారంతా జంతువులను హింసించడాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement