లగ్జరీ బైక్ లను దొంగతనం చేస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెకన్లలో లాక్ చేసి ఉన్న బైక్ ను కొట్టేయడం వీరి ప్రత్యేకత. మధ్యప్రదేశ్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లను చోరీ చేస్తున్నారు వీరిద్దరు. ఆ యువకుల చాకచక్యానికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీస్ స్టేషన్ లో డెమో చేస్తున్నప్పుడు పోలీసులు దీన్నంతా వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్వాలియర్ నగరంలోని డీడీ నగర్ ప్రాంతంలో తాము కొట్టేసిన బుల్లెట్ను దాచేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వస్తున్నారని తెలిసింది. దీంతో అక్కడి పోలీస్ ఇన్ఫార్మర్ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయి రంగంలోకి దిగారు. ఆ తర్వాత సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిఎస్పి) రవి భడోరియా బృందంగా ఏర్పడి వారిని పట్టుకునేందుకు డీడీ నగర్ ప్రాంతంలో తమ బలగాలతో మోహరించారు. యువకులు బుల్లెట్ తో అక్కడికి చేరుకోగానే పోలీసు బృందం చుట్టుముట్టి పట్టుకున్నారు. యువకులను మోరెనా జిల్లాకు చెందిన శ్యామ్ గుర్జార్, బజ్నా గురాజ్లుగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు బైక్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు మంచి ధర రావడంతో వాటిని మాత్రమే దొంగిలిస్తున్నామని వారు విచారణలో పోలీసులకు తెలిపారు.ఇద్దరు యువకులను అరెస్టు చేశామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని భదౌరియా చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..