ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు విమానాలు రోమేనియా, హంగరీ నుంచి భారత్ చేరుకున్నాయి. మరో విమానం కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలాండ్ ప్రభుత్వం కిలక నిర్ణయం తీసుకుంది. వీసా లేకుండా భారతీయ విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఆశ్రయం కల్పించింది. ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు పోలాండ్ అనుమతిస్తున్నట్లు పోలాండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ ఆదివారం తెలిపారు.
ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశాల్లోని భారతీయ ఎంబసీలు ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది భారతీయులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరందరిని దశలవారీగా భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా సైనిక దాడి మధ్య ఒంటరిగా ఉన్న పౌరుల తరలింపును భారతదేశం శనివారం ప్రారంభించింది. మొదటి తరలింపు విమానం, AI1944, సాయంత్రం బుకారెస్ట్ నుండి ముంబైకి 219 మందిని తిరిగి తీసుకువచ్చింది.