Friday, May 3, 2024

సినిమాల జోలికి వస్తే ఏపీ ప్రభుత్వం తాట తీస్తా: పవన్ కళ్యాణ్

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డాడు. ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటే చిత్ర పరిశ్రమ దారికొస్తుందని భావిస్తున్నారని ఆరోపించారు. కానీ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘నటులు, దర్శకులు కోట్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ సినిమా వాళ్లు ఎవరినీ దోచుకుని సంపాదించడంలేదు. తప్పుడు విధానాల్లో దోపిడీలు చేయడంలేదు. మేం డ్యాన్సులు చేసో, కిందపడో, మీదపడో, అవి ఇవీ విరగ్గొట్టుకునో, లేకపోతే బాహుబలిలో ప్రభాస్, రానా గార్ల లాగా కండలు పెంచి ఎంతో కష్టపడితేనే మాకు డబ్బులు వస్తున్నాయి. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు ఒక్క రోజులో డబ్బులు రావడంలేదు… రామ్ చరణ్ వంటి హీరో అద్భుతమైన రీతిలో స్వారీ చేస్తే అప్పుడు వస్తాయి డబ్బులు. అంతేతప్ప అక్రమ కాంట్రాక్టులతో అడ్డగోలుగా సంపాదించడంలేదు. హీరోయిన్లు ఎక్కడ్నించో వేరే దేశం నుంచో, వేరే రాష్ట్రం నుంచో వచ్చి, ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పడుతూ నటించి డబ్బులు తీసుకుంటే ఆమెను ఎందుకు తప్పుబడతారు? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. దయచేసి ఎవరూ తెగేవరకు లాగొద్దని హితవు పలికారు. దిల్ రాజు వంటి వారికి థియేటర్లు ఉండడం తప్పేముంది? ఒక్కసారి ఎలక్షన్లలో గెలిచి 30 ఏళ్లు అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నప్పుడు వ్యాపారాలు చేసుకునేవారికి కోరికలు ఉండవా? అని నిలదీశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, దాంతో తాము ఇన్ని వ్యాపారాలు చేస్తున్నామని బ్యాంకులకు చూపించి, రుణాలు తీసుకునేందుకే ఏపీ సర్కారు సినిమా టికెట్లు అమ్మేందుకు సిద్ధపడిందని పవన్ ఆరోపించారు. చిత్రపరిశ్రమ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఏపీలో సినిమాలపై ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యంపై మోహన్‌బాబు గారు స్పందించాలని పవన్ హితవు పలికారు. కావాలంటే తన చిత్రాలపై నిషేధం విధించి మిగతా వారి చిత్రాలను వదిలేయాలని మీ బంధువులకు(జగన్ ప్రభుత్వం) చెప్పాలంటూ మోహన్‌బాబును ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈరోజు ఏపీలో చిత్ర పరిశ్రమకు పట్టిన గతే రేపు శ్రీవిద్యానికేతన్‌కూ పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. చిరంజీవి గారి లాంటి వ్యక్తులు ఏపీ ప్రభుత్వాన్ని ప్రాధేయపడొద్దని కోరుకుంటున్నట్లు వివరించారు. సినిమాలు తాము తీస్తే టిక్కెట్లు ప్రభుత్వం అమ్మడమేంటని పవన్ ప్రశ్నించారు. సినిమాల జోలికి వస్తే ఏపీ ప్రభుత్వం తాట తీస్తానని హెచ్చరించారు.

సాయితేజ్ ఇంకా కళ్లుమూసుకునే ఉన్నాడని, కళ్లు తెరిచారో లేదో తనకు తెలియదన్నారు. ‘మీడియాకు స్పైసీ కథనాలు చాలా ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు? కోడికత్తి కేసు వెనుక ఉన్న కుట్రపై ప్రశ్నించండి. గిరిజనులకు భూములు ఎందుకు దక్కడం లేదు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారంపై మాట్లాడండి’ అని పవన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement