ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏపార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపడుతుందన్న నమ్మకం స్థానికుల్లో ఉంది. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే ఈ నియోజకవర్గం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదు. ప్రతిసారి ఇక్కడి ఓటర్లు తమ ఓట్లతో వైవిధ్యాన్ని చూపుతున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 2007లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కాస్గంజ్ స్థానాన్ని గెలుచుకుంది. 2007లో బీఎస్పీకి చెందిన హస్రత్ ఉల్లా షేర్వానీ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే 2012లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకుంది. 2012లో ఎస్పీకి చెందిన మన్పాల్ సింగ్పై షేర్వానీ ఓడిపోయారు. 2017లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్పుత్ ఎస్పీకి చెందిన మన్పాల్ సింగ్పై 49,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కాస్గంజ్ ఒక సిటీ.. జిల్లా ప్రధాన ఆఫీసులన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే యూపీలోని కీలక రణస్థలం నుండి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్పుత్పై కాంగ్రెస్ తరపున ఈసారి పోటీ చేయనున్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్పాల్ సింగ్కు టికెట్ లభించగా, బీఎస్పీ అభ్యర్థిగా పార్టీ కార్యకర్త ప్రభుదయాళ్ వర్మ బరిలో నిలిచారు.