Saturday, May 4, 2024

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం: ఎమ్మెల్సీ కవిత

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారని గుర్తు చేసారు. కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్మికుల శ్రేయస్సు టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న ఎమ్మెల్సీ కవిత, కార్మిక పక్షాన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం సైతం కార్మికులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో  బొగ్గు గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నివాళులు అర్పించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement