Tuesday, May 7, 2024

మడిపల్లికి కాళేశ్వరం జలాల: మంత్రి ఎర్రబెల్లి హామీ

ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, రూ.16 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.40లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో డ్రైనేజీలకు ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే, రూ.4 కోట్ల 56 లక్షలతో చేపట్టిన పోలేపల్లి నుంచి చంద్రు తండా వరకు బీటీ రోడ్డు, రూ.60 లక్షలతో తాన్య తండాకు బీటీ రోడ్డు, రూ.14లక్షల 94 వేలతో మన ఊరు- మన బడి కార్యక్రమాల శంకుస్థాపనలు చేశారు. ఎస్వీకే తండాలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో మురుగు నీటి కాలువల పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. మడిపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రవేశం, రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, రూ.40 లక్షలతో డ్రైనేజీ, రూ.16 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రారంభోత్సం చేశారు. అలాగే, రూ.4 కోట్ల 53 లక్షలతో PMGSY రోడ్డు,రూ. 60లక్షలతో బీటీ రోడ్డు, మడిపల్లిలో రూ.4 లక్షల 40 వేలతో మన ఊరు, మన బడి అభివృద్ధి పనులు, రూ.6 లక్షలతో ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంటాయపాలెం గ్రామంలో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఎండా కాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తాం అని ప్రకటించారు. ఇక్కడి చెరువు నింపి, ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. గ్రామంలో అర్హులైన అందరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వచ్చే నెల నుంచే 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామన్నారు. తొర్రూరు మండలంలోనే మడిపల్లికి అత్యధికంగా రూ.10 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులు చేశామని తెలిపారు. రూ.2 కోట్ల 60 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు చేపడుతామని చెప్పారు. వివిధ గ్రామాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేసి చుట్టుముట్టు గ్రామాలకు మడిపల్లిని కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మడిపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement