Sunday, May 19, 2024

TS: వాళ్లు గాంధీలు కాదు… జహంగీర్ లు… ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, మే 7(ప్రభ న్యూస్) : రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు… గాంధీలు కాదు… జహంగీర్ లని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఫెరోజ్ జహంగీర్ మనవడైన రాహుల్ కు గాంధీ పేరెక్కడి నుండి వచ్చింది.. ఆయన పేరు రాహుల్ జహంగీర్ అని ఉండా లి.. గాంధీల పేర్లు పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ‌ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ఎమర్జెన్సీ సమయంలో ఫెరోజ్ జహంగీర్ భార్య దివంగత పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో ఎందుకు చేర్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా విద్యావ్యవస్థలో రిజర్వేషన్లను తొలగించింది కాంగ్రెస్ మాత్రమే అని నొక్కి చెప్పారు. కేవలం పదవి యావాకోసమే కాంగ్రెస్ దేశాన్ని మూడు ముక్కలు చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యాలకు కూడా కాంగ్రెసోళ్లు రిజర్వేషన్లు, పౌరసత్వం అడగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి దేశ ప్రజల జీవితాలను నాశనం చేసిందని తీవ్ర నష్టం చేకూర్చిందని గుర్తు చేశారు. కేవలం మత ప్రాతిపదికన యూనివర్సిటీలకు మైనార్టీ హోదా ఇచ్చి అందులో ఎస్సీ, ఎస్టీ, ఓ బీసీలకు ఉద్యోగ విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు తొలగించారని దుయ్యబట్టారు. రానున్న భవిష్యత్తులో కూడా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను తీసేసి రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్ రద్దు చేశాము.. కానీ ఏనాడు బీజేపీ రిజర్వేషన్లను తొలగించలేదన్నారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోఉంటే హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలను కూడా ముస్లిం యూనివర్సిటీలుగా మారుస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను తీసేసి మన పిల్లలకు విద్య లేకుండా చేసిందన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించి వారికివ్వడానికే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణలో గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై బురద జల్లుతున్నారన్నారు. యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పట్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటికైనా ఈ వర్గాలు, హిందువులు కళ్ళు తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కూలాచారి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement