Saturday, May 4, 2024

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి గొంతు కోసిన ఉన్మాది

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించడం లేదన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. యైటింక్లైన్ కాలనీ కేకేనగర్‌కు చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలి పనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉంటుండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఇటీవల అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. మంగళవారం(నవంబర్ 9) మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. వారి కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. ఆపై ఇంట్లోని కత్తిపీటతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement