Sunday, April 28, 2024

వీల్‌చైర్‌లో కూర్చొని దీదీ ‘పాదయాత్ర‌’

పశ్చిమబెంగాల్ లో అధికార, విపక్ష పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. అనేక చోట్ల త్రిముఖ పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగియడంతో.. రెండో దశ ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాలికి గాయ‌మైన విష‌యం తెలిసిందే. కాలికి వైద్యులు క‌ట్టిన‌ క‌ట్టుతోనే ఆమె వీల్‌చైర్‌లో కూర్చొని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాను పోటీ చేయనున్న నందిగ్రామ్ నియోజ‌కవ‌ర్గంలో మ‌మ‌తా బెన‌ర్జీ వీల్‌చైర్ లో కూర్చొని పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాద‌యాత్ర చేశారు. ఆమె వెంట‌ భారీగా టీఎంసీ నేత‌లు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 8 కిలో మీటర్ల దూరం ఇది సాగింది. నందిగ్రామ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 1న రెండో దశలో ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సోమవారం ఈ యాత్ర నిర్వహించారు.

ఏప్రిల్ 1న‌ రెండ‌వ ద‌శ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నియోజ‌క వ‌ర్గంలో ఆమెపై బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సువెందు అధికారిపై దీదీ విరుచుకపడ్డారు. తానపై గెలిచి తీరుతానని అధికారి అంటున్నారని, కానీ ఈ నియోజకవర్గ ఓటర్లకు ఎవరికీ ఓటు వేయాలో తెలుసునని మమత అన్నారు. గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement