Monday, May 6, 2024

బీ రెడీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రాత్రి పూట కర్ఫ్యూ స్థానంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే​దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్దంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా లాక్‌డౌన్​ విధిస్తే నిరాశ్రయులు, బిక్షగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతున్నట్టు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర సూచనల మేరకు పాజిటివిటీ రేటు ఎక్కువ ఉండటంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో కరోనా సంబంధ అంశాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే రోడ్ల పక్కన ఉండేవారికి, నిరాశ్రయులకు ఆహారం, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా ముందుగానే వారందరిని బల్దియా నైట్​షెల్టర్లకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మే మొదటి వారంలోనే లాక్‌డౌన్ ​విధించే పరిస్థితులు ఉండటంతో ఆ లోపే వీలైనంత ఎక్కువ మందిని తమ పర్యవేక్షణలో ఉంచేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 15 నైట్ షెల్టర్లు పనిచేస్తుండగా.. సుమారు ఆరు వందల మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. నైట్​ షెల్టర్లును స్వచ్ఛంద సంస్థలే నిర్వహిస్తుండటంతో వారికి ఉన్న ఇతర ఆశ్రమాలు, షెల్టర్లలో కూడా సహాయం అందించేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement