Saturday, May 4, 2024

Telangana: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు.. పుర‌స్కారం అందుకున్న కేటీఆర్‌

బిజినెస్‌ని మ‌రింత‌ సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును అందించింది. ఈ సెక్టార్‌లో తెలంగాణ‌ ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను ఈ అవార్డున‌కు ఎంపిక చేశారు.

వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు వరించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మీసేవ (Mee Seva) కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు.. టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారం రావ‌డం మరో నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికకు ధన్యవాదాలు అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్ట‌ర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement