Thursday, April 25, 2024

NDTV: అదానీ టేకోవర్‌కు సెబీ ఆమోదం తప్పనిసరి.. వెల్ల‌డించిన ఎన్‌డీటీవీ

తమ సంస్థలో వాటాలు టేకోవర్‌ చేసుకోవడానికి అదానీ గ్రూప్‌ చేస్తున్న ప్రయత్నాలకు సెబీ ఆమోదం తప్పనిసరి అని ఎన్‌డీటీవీ గ్రూప్‌ తెలిపింది. ఈ కొనుగోలు దేశ మీడియా స్వతంత్రను గందరగోళానికి గురిచేస్తుందనే విస్తృత ఆందోళనల మధ్య ఈ ప్రకటన చేసింది. రెండేళ్లపాటు తమ సంస్థ ప్రమోటర్ల షేర్ల క్రయ విక్రయాలపై 2020 నవంబర్‌లో నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ గడువువచ్చే నవంబర్‌ 26న ముగుస్తుందని వివరించింది. ఈ సమయంలో తమ నెట్‌వర్క్‌ గ్రూప్‌ను టేకోవర్‌ చేసుకోవడానికి అదానీ గ్రూప్‌నకు సెబీ ఆమోదం తప్పనిసరి అని ఎన్‌డీటీవీ పేర్కొంది.

ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా వీసీపీఎల్‌ తన వాటాలు విక్రయించినా సెబీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ వివరాలను విశ్వనాథ్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీసీపీఎల్‌)కు సమర్పించామని తెలిపింది. అంతకు ముందు వీసీపీఎల్‌ను పూర్తిగా అదానీ గ్రూప్‌ అనుబంధ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ టేకోవర్‌ చేసింది. దీంతో ఎన్‌డీటీవీ ప్రమోటర్స్‌ గ్రూప్‌ ఆర్‌ఆర్పీఆర్‌లో వీసీపీఎల్‌కు కేటాయించిన 99.5 శాతం (ఎన్‌డీటీవీలో 29.18శాతం ) వాటాపై అదానీ గ్రూప్‌ హక్కులు క్లయిమ్‌ చేసింది. అయితే, ప్రమోటర్ల గ్రూప్‌ ఆర్‌ఆర్‌పీఆర్‌లో ప్రధాన వాటాదారులు ప్రణయ్‌రాయ్‌, రాధికారాయ్‌ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీల క్రయ విక్రయాల్లో పాల్గొనవద్దని సెబీ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement