Friday, April 26, 2024

Delimitation : డిలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: మంత్రి కేటీఆర్

లోక్ సభ డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం మంత్రి కే తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు.

తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని తెలిపారు. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement