Monday, April 29, 2024

వ్యాధి కారక వైరస్‌ కిల్లర్ ‘ఇన్‌స్టాషీల్డ్‌’.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇన్‌స్టాషీల్డ్‌ వైరస్‌ కిల్లర్‌ పరికరాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పరికరం ఎలా రూపొందించార్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రూపకర్త చారిని అభినందిస్తూ, ఆవిష్కరణ అద్భుతంగా ఉందని, ఈ పరికరం అందరికి ఉపయోగ పడుతుందని కొనియాడారు. పరికరం ఉత్పత్తికి పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీనిచ్చారు. ఇన్‌స్టాషీల్డ్‌ లాంటి ఆవిష్కరణలకు ఊతమిస్తామని తెలిపారు. గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్‌ పురస్కారానికి ఎంపికయ్యారని, ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా పరికరం ఆవిష్కర్త చారి మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని వైరస్‌ బారినుండి కాపాడాటానికే రెండేళ్లు శ్రమించి ఇన్‌స్టాషీల్లు రూపొందించానని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ పరికరాన్ని చేర్చడమే తన జీవితాశయమన్నారు. కరోనా, సార్స్‌, ఒమిక్రాన్‌ డెల్టా తదితర బ్యాక్టీరియాలు, అన్ని రకాల వైరస్‌లను నెగిటివ్‌ ఎలక్ట్రాన్‌ల సహాయంతో సంహరించే పరికరాన్ని రూపొందించానని తెలిపారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్‌ ల్యాబ్‌ తదితర సంస్థలు దీనిని ద్రువీకరించాయని, ఇన్‌స్టాషిల్డ్‌ మెడికల్‌ డివైస్‌ పేరిట విడుదల చేస్తున్నామని చారి తెలిపారు. దీనివల్ల దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని చెప్పారు. పరిశోధనలకు సీసీఎంబీ, టీఎస్‌ఐసీ సహకరించాయని చారి తెలిపారు. కరోనాతో సహా అన్ని రకాల వైరస్‌లను, భవిష్యత్తులో వచ్చే కొత్త రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను చంపటానికి సరిపడు ఒక నిర్దిష్టమైన వేవ్‌ లెంత్‌తో కొన్ని ట్రిలియన్లలో నెగెటివ్‌ ఎలెక్ట్రానుల అభివృద్ధి చేసి తద్వారా ఈ అన్ని రకాల వైరస్‌లను ఇన్‌స్టాషీల్డ్‌ సహకరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement