Wednesday, May 8, 2024

విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో ఇంజిన్ లో మంటలు..తప్పిన ప్రమాదం

విమానం టేకాఫ్ అయేందుకు సిద్ధమైన సమయంలో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశాడు. ఈఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు టేకాఫ్ అయేందుకు సిద్ధమైన ఇండిగో విమానంలోని ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో సిబ్బందితో కలిసి మొత్తం 184 మంది ఉన్నారు. సరిగ్గా రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా 11 గంటల తర్వాత ప్రయాణికులు బయటకు వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వారిని వేరే విమానంలో బెంగళూరుకు పంపారు. ఈ ఘటనపై ఇండిగో స్పందించింది.

టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని నిలిపివేసినట్టు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులను వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపిస్తామని పేర్కొంది. ఈ ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. విమానం టేకాఫ్ కావడానికి ఐదు సెకన్ల ముందు మంటలు అంటుకున్నాయి. పైలట్ విమానాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో లోపం తలెత్తిందని పైలట్ తమకు చెప్పినట్టు ఓ ప్రయాణికుడు తెలిపాడు. విమానం మరో ఐదు నుంచి ఏడు సెకన్లలో టేకాఫ్ కావాల్సి ఉందని, అప్పుడు తాను విమానం రెక్కల వద్ద మంటలు రావడాన్ని గమనించానని ఆ ప్రయాణికుడు తెలిపాడు. ఆ మంటలు క్షణాల్లోనే పెద్దవి అయ్యాయన్నారు. ఆ తర్వాత విమానం ఆగిపోయిందన్నారు. ఆ సమయంలో విమానం లోపల తీవ్ర గందరగోళం నెలకొందని అయితే, ఏం కాదని సిబ్బంది తమకు హామీ ఇచ్చారని అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement