Sunday, May 19, 2024

మావోయిస్టులకు పెరిగిన రివార్డులు.. జాబితా విడుదల చేసిన ఎన్‌ఐఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్ర నేతల ఆచూకీ తెలిపిన వారికి గతంలో ప్రకటించిన రివార్డును పెంచుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా, జార్కండ్‌, అస్సాం తదితర రాష్ట్రాలలో పని చేస్తూ పలు కేసులు నమోదైన మావోయిస్టు అగ్రనేతలు 106 మందిని ఎన్‌ఐఏ ఈ జాబితాలో చేర్చింది.2013లో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం జీరంఘాటి ప్రాంతంలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మ సహా 27 మందిని హత్య చేసిన ఘటనలో 156 మందిని నిందితులుగా పేర్కొన్నప్పటికీ ఎన్‌ఐఏ 21 మందిని హిట్‌లిస్టులో చేర్చింది.

ఇందులో 14 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలున్నారు. దేశంలోని 11రాష్ట్రాలు 73 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉందన్న ఎన్‌ఐఎ పలువురిపై నజరానాను పెంచింది. ఇప్పటికే కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతిపై ఇప్పటి వరకు ఉన్న రూ. 2.52 కోట్ల రివార్డును మరో 50 లక్షలకు పెంచారు. అంటే మొత్తంగా రూ. 3.02 కోట్లు అయ్యింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న సంబళ్ళ కేశవరావు అలియాస్‌ బస్వరాజైపై ఇప్పటి వరకు ఉన్న రూ. 50 లక్షల రివార్డును కోటికి పెంచారు.

కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ మోహన్‌, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ లక్ష్మణ్ణ, ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిసాన్‌ దా, మల్ల రాజిరెడ్డి అలియాస్‌ చేతన్‌, మోడం బాలకృష్ణ, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, పాక హన్మంతు అలియాస్‌ ఊకె గణేష్‌ తదితర 21 మందిపై రూ. 7 లక్షలున్న రిమార్డును కోటి రూపాయల వరకు పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement