Friday, April 26, 2024

Breaking: ఒళ్లు మరిచి ఓటేస్తే, ఇళ్లు కాలే ప్రమాదం ఉంది.. ఆలోచించి ఓటేయ్యాలే ఆగం కావద్దు: సీఎం కేసీఆర్‌

ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి ఓటు వేయాలే.. మ‌న బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది అని సీఎం కేసీఆర్ అన్నారు. న‌ల్గొండ జిల్లా చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం మీరు ఎప్పుడో తేల్చేశారు. అది కూడా తెలుసు. నేను కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు. ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌ని ఇక్క‌డికి వ‌చ్చాను. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఎన్నిక‌లు రాగానే ఏందో ఏమో మాయ‌రోగం ప‌ట్టుకుంటుంది. గ‌త్త‌ర గ‌త్త‌ర లొల్లి లొల్లి ఉంట‌ది. కొంద‌రైతే గ‌జం ఎత్తున గాల్లోనే న‌డుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వ‌స్తాయి.

నేను చెప్పిన మాట‌లు జాగ్ర‌త్త‌గా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. ఈ మాట‌ల‌ను ఇక్క‌డ‌నే వ‌దిలేసి వెళ్లిపోవ‌ద్దు. మీ ఊరెళ్లిన త‌ర్వాత చ‌ర్చ చేసి నిజ‌నిజాలు తేల్చాలి. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో మ‌న‌సు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని సీఎం కేసీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement