Thursday, May 9, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా

మానవ మనుగడకు చెట్లు జీవనాడులన్నారు విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నివాసంలో రాజ్యసభ సభ్యుడు “గ్రీన్ ఇండియా చాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్, ఇతర టీఆర్ ఎస్‌ ఎంపీలతో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం మార్గరెట్ అల్వా మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఇవ్వాల కాలుష్య కార్ఖానాగా మారిపోయింది. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఇవ్వాల జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారు.

దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. మనిషి శాశ్వతం కాదు.. కానీ, భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంతోష్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలి’’ అని అల్వా పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు, పసునూరి దయాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement