Saturday, May 4, 2024

Motors | ఈవీల తయారీలోకి ఫాక్స్‌కాన్‌.. పలు రాష్ట్రాలతో చర్చలు

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ కంపెనీ విద్యుత్‌ వాహనాల తయారీలోకి ప్రవేశించనుంది. ఇందు కోసం దేశంలో ఈ సంవత్సరంలోనే విద్యుత్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫాక్స్‌కాన్‌ యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తోంది. మన దేశంలో కర్నాటకలో ఈ సంస్థ ఐఫోన్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో యాపిల్‌ కంపెనీ ఇతర ఉత్పత్తులను తయారు చేసుకుందుకు ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. విద్యుత్‌ వాహనాల తయారీ కోసం నాలుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు ఫాక్స్‌కాన్‌ వెల్లడించింది. త్వరలోనే దినిపై స్పష్టత వస్తుందని తెలిపింది.

ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నది. తమిళనాడులో ఫాక్స్‌కాన్‌కు ఐఫోన్ల తయారీ హబ్‌ ఉంది. అందు వల్ల ఇక్కడే విద్యుత్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. ప్రోత్సహకాలు, సంప్రదింపుల విషయంలో యాక్టివ్‌గా ఉంటున్న తెలంగాణను ప్లాంట్‌ ఏర్పాటుకు పరిశీలించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

ఫ్యాక్స్‌కాన్‌ ఏర్పాటు చేసే ప్లాంట్‌లో తన స్వంత బ్రాండ్‌తో వాహనాలను తయారు చేస్తుందా, మల్టిd బ్రాండ్‌గా వివిధ కంపెనీలకు చెందిన విద్యుత్‌ వాహనాలను తయారు చేస్తుందా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధులు త్వరలోనే తైవాన్‌లో పర్యటించనున్నారు. సెమికండక్టర్‌ చిప్స్‌ తయారీకి ఫాక్స్‌కాన్‌, వేదాంత కలిసి 2022లో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్‌కాన్‌ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement