Sunday, April 28, 2024

విద్యుత్​శాఖ డీఈ ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు.. ఏసీబీకి చిక్కిన‌వి 100 కోట్లకు పైగా ఆస్తులు

ఓ విద్యుత్ శాఖ అధికారిపై ఏసీబీ అధికారులు రైడ్ చేయ‌గా 100 కోట్ల‌కు పైగా ఆస్తులు, న‌గ‌లు, న‌గ‌దు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. నల్ల‌గొండ‌, హైదరాబాద్​లలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి. రూ. కోట్ల విలువైన భూముల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలు ఏసీబీ అధికారులకు ల‌భించాయి. వాటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్ రెడ్డి మిర్యాలగూడ లో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటు, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ. కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఎట్లా దొరికారంటే…
లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు ఓ లైన్‌మ‌న్‌ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాన్స్‌కో ఆఫీసులు మొన్న‌ జరిగింది. అయితే మిర్యాలగూడ లోని రెడ్డికాలనీ లైన్‌మ‌న్‌గా గుంటూరు శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. తన కుమారుడికి హెల్త్ బాగా లేని కారణంగా 2004 నవంబరు 23నుంచి సెలవుపై వెళ్లాడు. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్​మెన్​గా విధుల్లో చేరాడు. అయితే 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్ తో పాటు, ఇంక్రిమెంట్లు, లీవ్ పీరియడ్‌కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్‌ రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు.

వారంతా ప‌ట్టుబ‌డ్డారిలా..
అయితే ఆ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లిస్తేనే ఫైల్ కదులుతుందని తెగేసి చెప్పారు అధికారులు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2లక్షల నగదుతో డీఈ చాంబ‌ర్‌కు వెళ్లాడు. అక్కడ మురళీధర్‌రెడ్డి. లతీఫ్, దామోదర్‌తో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.
కాగా, ఈ దాడిలో పట్టుబడ్డ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో మురళీధర్‌రెడ్డికి చెందిన ఇంట్లో, నల్లగొండలోని లతీఫ్, దామోదర్ ఇళ్లలో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement