Saturday, May 4, 2024

మహా మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అనిల్ దేశ్ ముఖ్‌ వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండే, వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండేను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్ట్ చేసింది. శుక్రవారం అదుపులోకి తీసుకుని తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది. అనంతరం ఇరువురినీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. శుక్రవారం ఈడీ ఎదుట ముంబయిలో బల్లార్డ్ ఎస్టేట్‌లోని కార్యాలయంలో సంజీవ్ పలాండే, కుందన్ షిండేలు హాజరయ్యారు. అయితే, విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, దర్యాప్తునకు సహకరించలేదని ఈడీ ఆరోపించింది. అందుకే ఇరువురినీ అరెస్ట్ చేసినట్టు తెలిపింది.

శుక్రవారం నాగ్ పూర్ లోని అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ముంబైలోని వర్లి, మలబార్ హిల్ లోని ఇళ్లపైనా దాడులు చేశారు. బార్ల యజమానుల దగ్గర్నుంచి దాదాపు రూ.4 కోట్ల దాకా డబ్బును వసూలు చేసినట్టు తెలుస్తోంది. వారి నుంచి వసూలు చేసిన డబ్బును సచిన్ వాజే.. వేరే రాష్ట్రాల్లో ఉన్న బూటకపు సంస్థల ద్వారా అనిల్ దేశ్ ముఖ్ కు బదిలీ చేసినట్టు సమాచారం. ఈ ఆధారాలతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.

మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేయాలని పేర్కొంది. అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అనిల్ దేశ్‌ముఖ్ ఏప్రిల్ తొలివారంలో హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చి ఆయన్ను విచారిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement