Sunday, April 28, 2024

డ్ర‌గ్ మాఫియా నెట్ వ‌ర్క్ ఛేదించిన ఎన్ సి బి..కోట్ల విలువైన ఎల్‌ఎస్‌డీ స్వాధీనం..

ఢిల్లీ: డార్క్‌ వెబ్ ఆధారంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ఓ భారీ నెట్‌వర్క్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది.. ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసింది.. అలాగే రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ సి బి ప్రకటించింది. ఇప్పటివరకు ఒకే ఆపరేషన్‌లో ఈ స్థాయిలో ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వెల్లడించింది.

‘ఈ భారీ నెట్‌వర్క్ దేశ, విదేశాల్లో విస్తరించి ఉంది. పోలాండ్, నెదర్లాండ్స్, అమెరికాలనుంచి ఎల్‌ఎస్‌డీని అక్రమంగా దిగుమతి చేసుకొని.. దిల్లీ- ఎస్‌ఈఆర్‌, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారు. చెల్లింపుల కోసం డార్క్‌ నెట్‌లో క్రిప్టో కరెన్సీలను ఉపయోగించారు. నిందితుల వద్ద నుంచి రూ.4.60 లక్షల విలువైన 2.2 కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నాం. బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు ఉన్నట్లు గుర్తించాం’ ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉత్తర విభాగం) జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.
ఎల్‌ఎస్‌డీ దుర్వినియోగం యువతలో ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. దీని వాణిజ్య పరిమాణం 0.1 గ్రాములని, ఈ మొత్తాన్ని కలిగి ఉన్నా.. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదవుతుందన్నారు. తాజా దాడిలో పట్టుబడిన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లు దాని వాణిజ్య పరిమాణం కంటే 2,500 రెట్లు ఎక్కువని వెల్లడించారు. ఒక బ్లాట్‌. చిన్న పేపర్‌ ముక్క పరిమాణంలో ఉంటుంది. ప‌ట్టుబ‌డిన ఈ బ్లాట్ల విలువ కోట్ల‌లో ఉంటుంద‌ని ఎన్ సి బి అధికారులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement