Saturday, April 27, 2024

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి .. అమౌ హాజీ కన్నుమూత

ఇరాన్ కి చెందిన అమౌహాజీ ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరు గాంచారు. కాగా ఆయన కన్నుమూశారు. అతని వయసు 94ఏళ్లు. అర దశాబ్దానికిపైగా స్నానానికి దూరంగా ఉన్న అమౌ హాజీ అనారోగ్యం బారినపడకుండానే మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో మృతి చెందాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి ఆయన తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడతానన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులు కూడా ఎప్పుడూ కడుక్కోలేదు. చనిపోయిన మూగజీవాలను తింటూ బతికేవాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లను ఊదిపడేసేవాడు.

స్నానం లేకుండా వింత జీవితాన్ని గడుపుతున్న హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ముకొట్టుకుపోయిన హాజీకి ఇటీవల గ్రామస్థులందరూ కలిసి బలవంతంగా స్నానం చేయించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మృతి చెందడం గమనార్హం. యువకుడిగా ఉన్నప్పుడు అతడికి ఎదురైన పలు ఘటనలు అతడిని స్నానానికి దూరం చేశాయని గ్రామస్థులు పేర్కొన్నారు. హాజీ మరణంతో జీవితకాలంలో అత్యధిక కాలం స్నానం చేయని వ్యక్తి రికార్డు ఇప్పుడు అనధికారికంగా భారతీయుడి సొంతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి శివారులోని ఓ గ్రామానికి చెందిన కైలాశ్ ‘కాలౌ’ సింగ్ (63) 30 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నట్టు 2009లో ‘హిందూస్థాన్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. దీనిని బట్టి ఇప్పటికి 44 ఏళ్లుగా ఆయన స్నానానికి దూరంగా ఉన్నాడు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలోనే తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement