Thursday, May 2, 2024

డిగ్రీ 4 ఏళ్లు, సెమిస్టర్లు 8.. పీహెచ్‌డీ అడ్మిషన్లకు కొత్త నిబంధనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సుతో 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్‌ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్‌, సోషల్‌, హ్యూమానిటీస్‌, వృత్తి విద్యా వంటి సబ్జక్టులు ఉంటాయని పేర్కొంది. మూడో సెమిస్టర్‌ ముగిసిన తర్వాత మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులను వివ్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల కేటాయింపు ఉంటుంది. 7, 8 సెమిస్టర్లలో మాత్రం విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులోని ఏదైనా అంశంపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపులకు, వొకేషనల్‌, అకడమిక్‌ విభాగాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదని, యూజీసీ స్పష్టం చేసింది.

మరోవైపు పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి కూడా యూజీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటికే ఉన్న నేషనల్‌ ఎలిజిబులిటి టెస్టు(నెట్‌)కు అదనంగా మరో ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టింది. ఇన్నాళ్లు యూనివర్శిటీలు మాత్రమే పీహెచ్‌డీ ప్రవేశాలను అందించేవి. ఇకపై ఎన్‌ఈటీ లేదా జేఆర్‌ఎఫ్‌ ద్వారా 60 ద్వారా 60 శాతం ప్రవేశాలను అధికారులు భర్తీ చేయనున్నారు. మిగిలిన 40 శాతం సీట్లను వర్శిటీలు ప్రత్యేక కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు నిర్వహించి భర్తీ చేయనున్నాయి. పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్లు కావాలనుకునేవారు ఇకపై నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు 7.5 శాతం సీజీపీఏ సాధించి ఉండాల్సిందే. ఈ మేరకు అర్హత సాధించిన వారికే పీహెచ్‌డీ అడ్మిషన్లు కేటాయించేలా నిబంధనలను యూజీసీ సవరించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement