Wednesday, May 15, 2024

తెలంగాణ దేశానికే దిక్సూచి.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్‌’ నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. వ్యవసాయం బాగుంటేనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జిడిపికి దో#హదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోశిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్‌ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement